రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు

రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదు 
* అమరావతి నుండి రాజధానిని తీసేయమని ఏ కమిటీ చెప్పలేదు 
* రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు చేశాం
* రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 30శాతం 
* వ్యవసాయానికి 9గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్న రైతు సంక్షేమ ప్రభుత్వమిది 
* అన్ని పంటలకు మద్ధత్తు ధరను అందిస్తున్నాం 
* రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి
అమరావతి: రాజధాని ప్రాంతానికి చెందిన రైతాంగానికి ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయబోదని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నుండి రాజధానిని తీసేయమని ఏ కమిటీ చెప్పలేదని కావున రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయబోదని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ విషయంలో ప్రజలు అపోహ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి బిఎన్ రావు, బిసిజి కమిటీలు సమర్పించిన నివేదికలను పూర్తిగా పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని ఆకమిటీ ఆయా కమిటీల నివేదికలను పూర్తిగా అధ్యయనం చేస్తోందని చెప్పారు.రాజధానికి సంబంధించి రైతులు లేదా మరెవరికైనా ఏమైనా అపోహలు, అనుమానాలు ఉంటే ఈ కమిటీకి విజ్ణాపనలు అందించవచ్చని వాటిని ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయడం జరుగుతుందని నాగిరెడ్డి చెప్పారు. 
                          గత ఎనిమిది మాసాలుగా ఈ ప్రభుత్వం పేదలు,మహిళలు ముఖ్యంగా రైతుల సంక్షేమానికి అనేక పధకాలు అమలు చేస్తూ ప్రజాహిత పాలనను అందించడం జరుగుతోందని వ్యవసాయమిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి పేర్కొన్నారు. 2004 నుండి 2009 వరకూ దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన రైతులకు ఉచిత విద్యుత్, మద్ధత్తు ధర,రైతు ఋణాల మాఫీ వంటి పధకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే కృత నిశ్చయంతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.వచ్చే మే నుండి అమలు చేయాల్సి ఉన్న రైతు భరోశా పధకాన్ని ఎనిమిది నెలలు కన్నా ముందు గానే ప్రతి రైతుకు 13వేల 500 రూ.లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి రైతులకు అన్ని విధాలా మేలుకలిగిస్తున్నారన్నారు.అదే విధంగా అన్ని పంటలకు మద్ధత్తు ధరను ప్రకటించడం,వ్యవసాయానికి పగటివేళ 9గం.ల నిరంతరం ఉచిత విద్యుత్ సరఫరా,ఆక్వా రైతులకు యూనిట్ రూపాయి 50పైసలకే అందించడం వంటి కార్యక్రమాలు ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని పేర్కొన్నారు.అంతేగాక గత వ్యవసాయ ఉత్పత్తులు 106.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తికాగా ఈఏడాది 120.3లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగిందని దీనిని బట్టి వ్యవసాయ రంగాభివృద్ధికి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్దం అవుతోందని నాగిరెడ్డి పేర్కొన్నారు.